సాక్షి, హైదరాబాద్ : ఒడిషా నుంచి తమిళనాడు వరకూ కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలో కొన్ని చోట్ల కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
ముంచెత్తనున్న భారీ వర్షాలు
ఇక రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని, సాధారణంగా జులై 15 వరకూ రుతుపవనాలు దేశమంతటా విస్తరించే క్రమంలో ఈసారి రెండు వారాలు ముందుగానే రుతుపవనాలు పలకరించాయని, శుక్రవారంతో దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) అధికారి డాక్టర్ సతీదేవి వెల్లడించారు. రానున్న మూడురోజుల్లో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. మరోవైపు ప్రైవేట్ వాతావరణ ఏజెన్సీ స్కైమెట్ సైతం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాలు మేఘావృతమయ్యాయని, రాజధాని నగరం ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.